సికార్‌లో ఎర్రజెండా రెపరెపలు

పేమారామ్‌కు విశేష ఆదరణ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లాలో ధోడ్‌ శాసనసభ స్థానం నుంచి సిపిఎం తరపున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పేమారామ్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఇక్కడ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం ప్రధాన ఎన్నికల అంశంగా ఉంది. బయో-వ్యర్థాల నుండి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో పవర్‌ ప్లాంట్‌కు ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎడిబి) నిధులు సమకూరుస్తుంది. ఇది పెద్ద ఎత్తున పర్యావరణ కాలుష్యానికి, పంట విధ్వంసానికి దారి తీస్తుందని ధోడ్‌లో ఆందోళనలు చేస్తున్నారు. గత మూడు నెలలుగా పేమారామ్‌ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, ధోడ్‌ మాజీ ఎమ్మెల్యే అమ్రారామ్‌ కూడా ఆందోళనలో ముందున్నారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పేమారామ్‌ను ధోడ్‌కు రక్షకుడిగా స్థానిక ప్రజానీకం కొనియాడుతున్నారు. రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన ధోడ్‌లో సిపిఎం అభ్యర్థిగా పేమారామ్‌ బరిలో నిలిచారు. సిపిఎం వరుసగా నాలుగుసార్లు గెలిచిన నియోజకవర్గం ధోడ్‌. అమ్రారామ్‌ మూడుసార్లు గెలిచారు. 2008లో రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంగా మారిన తర్వాత ధోడ్‌ ప్రజలు పేమారామ్‌ను ఎన్నుకున్నారు. 2013, 2018లో పేమారామ్‌ రెండో స్థానంలో నిలిచారు. 2013లో బిజెపి, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది.పేమారామ్‌పై ధోడ్‌ ప్రజలకు ఉన్న ప్రేమ ఎన్నికల ర్యాలీల్లో ప్రతిబింబిస్తోంది. ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో జనం వేలాదిగా తరలివచ్చి ర్యాలీల్లో భాగస్వాములవుతున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. 2013లో గెలుపొందిన గోర్ధన్‌ వర్మ బిజెపి అభ్యర్థిగా మూడోసారి బరిలోకి నిలిచారు. కాంగ్రెస్‌కు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే పర్శరామ్‌ మొరాడియాకు ఈసారి టిక్కెట్‌ దక్కలేదు. ఆయన కుమారుడు మహేశ్‌ మొరాడియా కూడా టిక్కెట్‌ ఇవ్వలేదు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన జగదీష్‌ ధనోడియా కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సరైన అభ్యర్థి దొరకకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ధనోడియాను కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా చేసింది. ఈ నేపథ్యంలో పేమారామ్‌ విజయం ఖాయమని స్థానికులు తెలిపారు. ధోడ్‌లో ఎర్రజెండా ఎగురేస్తాం : పేమారామ్‌ ధోడ్‌ నియోజకవర్గంలో తిరిగి ఎర్రజెండా రెపరెపలాడుతుందని పేమారామ్‌ తెలిపారు. ఇక్కడ సిపిఎంను గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన ‘ప్రజాశక్తి’ ప్రతినిధితో మాట్లాడుతూ ‘గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రజలు పరీక్ష పెట్టారు. ఫలితంగా నిరాశే ఎదురైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు సీటు కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ఉంది” అని తెలిపారు. ‘పర్యావరణాన్ని దెబ్బతీసే పవర్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాడింది సిపిఎం మాత్రమే. కాంగ్రెస్‌, బీజేపీలు పాల్గొలేదు. ఈ విషయాలన్నీ ఓటర్లకు బాగా తెలుసు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ నుంచి ఎక్కువ మంది కార్యకర్తలు సిపిఎంలోకి వస్తున్నారు. ఈ దఫా ఎర్రజెండాదే విజయం’ అని పేమారామ్‌ అన్నారు.

➡️