బాగల్కోట్ : పాఠశాల బస్సు, ట్రాక్టర్ను ఢీకొట్టిన ఘటన కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా అలగూరు సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 8 మందికి గాయాలయ్యాయి. ఈ విద్యార్థులంతా వర్దమాన్ మహావీర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఆదివారం రాత్రి కవటగిరిలో పాఠశాల వార్షికోత్సవానికి హాజరై తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై సీఎం సిద్ధరామయ్య ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. విద్యార్థుల మృతిపై విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.