Orphans: అనాథాశ్రమంలో ఐదుగురు పిల్లలు మృతి

Jul 3,2024 07:40 #Madhya Pradesh, #Orphans Home

ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని అనాథాశ్రమంలో ఐదుగురు పిల్లలు మృతి చెందగా, 30 మంది అస్వస్థతకు గురయ్యారని జిల్లా అధికారులు మంగళవారం తెలిపారు. మరణించిన పిల్లలందరూ 14 ఏళ్లలోపు వారే. కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించబడనప్పటికీ, నాలుగు కేసుల్లో ఫుడ్ పాయిజనింగ్‌గా అనుమానిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. నగరంలోని మల్హర్‌గజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆశ్రమంలో అనాథలు, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న 200 మందికి పైగా చిన్నారులు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ఆశ్రమంలో 12 మంది పిల్లలకు వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే ఎంవైహెచ్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పరిస్థితి విషమించడంతో వారిలో ఐదుగురు పిల్లలు మృతి చెందారు.
ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ ఆదేశాల మేరకు వైద్యులు, ఆహార శాఖ అధికారులతో కూడిన ఒక బృందం ఇటీవల పిల్లల అనాథాశ్రమాన్ని సందర్శించింది. బృందానికి నాయకత్వం వహించిన అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర సింగ్ రఘువంశీ విలేకరులతో మాట్లాడుతూ… ఘటనపై విచారణ జరుగుతుందన్నారు. విచారణలో డైరెక్టర్ల నిర్లక్ష్యం తేలితే తగిన చర్యలు తీసుకుంటామని, ఆశ్రమానికి అందించే ఆహారం, రేషన్‌కు సంబంధించిన నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు.

➡️