- మృతుల్లో ఎపి విద్యార్థి
కన్యాకుమారి : తమిళనాడులోని కన్యాకుమారిలో సోమ వారం ఒక బీచ్లో మునిగి పోయి ఐదుగురు వైద్య విద్యార్థులు మరణించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి వెంకటేష్ ఉన్నారు. ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజీ హాస్పటల్, త్రిచీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పటల్కు చెందిన విద్యార్థులు ఒక వివాహ వేడుకలో పాల్గొనడం కోసం ఆదివారం కన్యాకుమారికి వచ్చారు. తరువాత సోమవారం వీరంతా కొన్ని కొన్ని గ్రూపులుగా వీడిపోయి కన్యాకుమారి చూడ్డానికి వెళ్లారు. వీరిలో కొంత మంది లీమూర్ బీచ్కు వద్దకు వెళ్లారు. ఈ బీచ్ను సముద్రం అల్లకల్లోంగా ఉన్న కారణంగా అప్పటికే మూసివేశారు. అయినా విద్యార్థులు ఒక కొబ్బరి తోట గుండా బీచ్లోకి అక్రమంగా ప్రవేశించారు. స్నానం చేస్తూ మునిగిపోయి ఐదుగురు మరణించారు. మృతి చెందిన ఐదుగురు వైద్య కోర్సు చివరి ఏడాదిలో ఉన్నారు. మరికొన్ని వారాల్లో వీరి కోర్సు పూర్తి కానుంది. మృతుల్ని వెంకటేష్తో పాటు, కన్యాకుమారి జిల్లాకు చెందిన పి సర్వదర్షిత (23), దిండిగల్ జిల్లాకు ఎం ప్రవీణ్ సామ్ (23), బి. గాయత్రి (25) (నెయ్వేలి), డి.చరుకవి (23) (తంజావూర్)గా గుర్తించారు.