- ఆరుగురు చిన్నారులు మృతి
- 20 మందికి గాయాలు
- రంజాన్ రోజూ తరగతులపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
మహేంద్రగఢ్ : రంజాన్ పర్వదినం రోజు హర్యానాలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఒక స్కూల్ బస్సు బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. నార్మౌల్ జిల్లాలో మహేంద్రగఢ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బస్సు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని, బస్సుకు ఫిట్నెస్, ఇతర సర్టిఫికెట్లు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. పాఠశాల బస్సుకు సరైన పత్రాలు లేని కారణంగా యాజమాన్యంపై కేసు నమోదు చేసి రూ.15, 500 జరిమానా విధించినట్లు రవాణా శాఖ అధికారులు చెప్పారు. రంజాన్ పండగ రోజు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైన వార్తపై హర్యానా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ సెలవు రోజైన రంజాన్ నాడు తరగతులు నిర్వహించడంపై విచారణకు ఆదేశించింది. పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు విద్యాశాఖ మంత్రి సీమాత్రిఖ తెలిపారు. ఆసుపత్రులో చికిత్స పొందుతున్న చిన్నారులను మంత్రి పరామర్శించారు.