-ముస్లిం మహిళలపై రంగులతో దాడి
– నలుగురి అరెస్టు
లక్నో : ముస్లింల పట్ల విద్వేష జాఢ్యాన్ని పెంచిపోషిస్తున్న బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో హిందూత్వ ఆకతాయిలు రెచ్చిపోయారు. బిజ్నోర్లో హోలీ పేరుతో ముస్లిం మహిళలపై వేధింపులకు పాల్పడ్డారు. మహిళల్లో ఒకరు వృద్ధురాలు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తంకావడంతో పోలీసులు నలుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముస్లిం యువకుడు ఒకరు భార్య, తల్లితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా..ఆ దారిలో హోలీ జరుపుకుంటున్న యువకులు వారిని అడ్డుకున్నారు. బైక్ మీద ఉండగానే బలవంతంగా రంగులు పులిమారు. బక్కెట్లతో నీళ్లు కుమ్మరించారు. మహిళల్లో ఒకరు వృద్ధురాలు అయినా కూడా దుండగులు రంగులు చల్లారు. బైక్ చుట్టిముట్టి ‘జై శ్రీరామ్..’ నినాదాలు చేయాలని పట్టుబట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దుండగులను గుర్తించి, నలుగురిని అదుపులోకి తీసుకున్నామని ధాంపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/UP-1.jpg)