శ్రీనగర్ : ఈ నెల 4న పూంచ్ వద్ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) వాహనాలపై దాడి కేసులో ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను భారత సైన్యం సోమవారం విడుదల చేసింది. నిందితుల ఆచూకీ చెప్పిన వారికి రూ.20 లక్షల నగదు బహుమతితో పాటు ఆచూకీ చెప్పిన వారి గుర్తింపు రహస్యంగా ఉంచుతామని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం మధ్యాహ్నం పూంచ్లోని సూరన్కోట సమీపంలో జరిగిన దాడిలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సైన్యం అనుమానిస్తోంది. ఈ దాడిలో ఒక ఐఎఎఫ్ జవాన్ మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నిందితుల కోసం పూంచ్ అటవీ ప్రాంతంలో భారీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.