న్యూఢిల్లీ : ఎన్డీయే హయాంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణాలన్నీ కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కూలిందని, జబల్పూర్ ఎయిర్పోర్ట్ రూఫ్ కూలిందని, రాజ్కోట్ ఎయిర్పోర్ట్ కనోపీ ధ్వంసమైందని ఆయన సభలో వివరించారు. ఇక అయోధ్యలో రహదారులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. రామ్ మందిర్లో లీకేజీలు, ముంబై హార్బర్ లింక్ రోడ్డులో పగుళ్లు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు.
బిహార్లో వారంలోనే మూడు వంతెనలు కుప్పకూలగా, ప్రగతి మైదాన్ టన్నెల్ నీటి మునిగిందని తెలిపారు. కుప్పకూలిన నిర్మాణాలన్నీ ఎన్డీయే హయాంలో చేపట్టినవేనని, వారి పాలనలో ప్రతి భవనం కూలిపోయే ముప్పు కలిగి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణాల గురించే కాదు.. కుంభకోణాల గురించి కూడా ఆయన సభలో ప్రస్తావించారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం ఎన్నికల బాండ్ల స్కామ్ అని, ఎన్నికల బాండ్ల వ్యవహారంపై విచారణ జరిపించాలని కేసీ వేణుగోపాల్ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/k.c-venugopal.jpg)