శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ బారాముల్లా జిల్లాలో లష్కరే తొయిబా (ఎల్ఇటి)కి చెందిన ‘మిలిటెంట్ సహచరుడు’ని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతంలో చెక్పాయింట్ను ఏర్పాటు చేశాయని , అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అడ్డుకున్నామని అన్నారు. అయితే ఆ వ్యక్తి పారిపోయేందుకు యత్నించడంతో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆ వ్యక్తిని నౌపోరాకి చెందిన ఇమ్రాన్ అహ్మద్ గనీగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అతని నుండి చైనా పిస్టల్, పిస్టల్ మ్యాగజైన్, తొమ్మిది బుల్లెట్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఆ అధికారి తెలిపారు. అతనిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశామని అన్నారు.