న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార సభల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తున్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్, సమాజ్వాది పార్టీలు అధికారంలోకి వస్తే.. అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పటివరకు తాము బుల్డోజర్లు వాడలేదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఇసి (ఎన్నికల సంఘం) చర్యలు తీసుకోవాలని ఖర్గే అన్నారు. ప్రధానమంత్రే ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం రక్షిస్తామని, రాజ్యాంగాన్ని ఫాలో అవుతామని ఆయన అన్నారు.
ఇండియా బ్లాక్కు మమతా మద్దతు గురించి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ విమర్శించారు. బెంగాల్ సిఎం మమతా ‘ఇండియా’ బ్లాక్ కంటే కూడా.. ఎన్డిఎకి మద్దతు ఇస్తున్నారు అని అధిర్ అన్నారు. ఈయన వ్యాఖ్యలపై ఖర్గే స్పష్టం చేశారు. మమతా మొదట ఇండియా’ బ్లాక్కి బయటి నుంచి సపోర్టు ఇస్తామని, ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే.. అప్పుడు ప్రభుత్వంలో కలుస్తామని ఆమె ఇటీవల కూడా పేర్కొన్నారు. కాబట్టి మమతా ‘ఇండియా’లో భాగమే అని ఖర్గే వెల్లడించారు.