ముస్లిం కమ్యూనిటీపై విషం చిమ్ముతున్న బిజెపి .. అక్బర్‌పూర్‌ పేరు మార్పు

లక్నో :     దేశవ్యాప్తంగా ముస్లిం కమ్యూనిటీపై విషం చిమ్ముతున్న బిజెపి ప్రభుత్వం.. తాజాగా యుపిలో మరో నగరం పేరు మార్చేందుకు సిద్ధమైంది. అంబేద్కర్‌ నగర్‌ జిల్లాలోని ముఖ్య నగరం అక్బర్‌పూర్‌ పేరును మారుస్తున్నట్లు ఆ రాష్ట్ర సిఎం యోగి ప్రకటించారు. ” అక్బర్‌పూర్‌ నగరం పేరును పలుకుతుంటే నోటికి చెడ్డ రుచి వస్తోంది. హామీ ఇవ్వండి. ఇవన్నీ మారతాయి. మనదేశం నుండి వలసవాద గుర్తులన్నింటినీ నిర్మూలించాలి. మన దేశ సంస్కృతిని గౌరవించాలి ” అని చెప్పుకొచ్చారు. అక్బర్‌పూర్‌ మాత్రమే కాదు.. అలీఘర్‌, అజంగఢ్‌, షాజహాన్‌పూర్‌, ఘజియాబాద్‌, ఫిరోజాబాద్‌, ఫరూఖాబాద్‌, మొర్దాబాద్‌లతో పాటు రాష్ట్రంలోని అనేక ముస్లిం జిల్లాల పేర్లను మార్చనున్నట్లు తెలుస్తోంది.

2017లో యోగి సిఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, చారిత్రక అణచివేత చిహ్నాల నిర్మూలన మిషన్‌ పేరుతో ముస్లిం పేర్లను మార్చడం ప్రారంభించారు. భారత్‌లో బానిసత్వ అవశేషాలను తొలగించాలని, దేశ వారసత్వాన్ని గౌరవించాలంటూ కేంద్రంలో ప్రధాని మోడీ సైతం ముస్లింలపై విషాన్ని చిమ్ముతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యుపిలోని పలు రోడ్లు, పార్కులు , కూడళ్లు, ప్రభుత్వ భవనాలకు మాజీ ప్రధాని వాజ్‌పేయి పేర్లు పెట్టారు.

లక్నోలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి రోడ్డు మీదుగా ప్రయాణించి, అటల్‌ చౌరస్తా కూడలి నుండి, అటల్‌ బిహారీ వాజ్‌పేయి కాన్ఫరెన్స్‌ సెంటర్‌ మీదుగా అటల్‌ సేతు దాటి, అటల్‌ బిహారీ కళ్యాణ మండపానికి చేరుకుంటారు. ఇలా వరుసగా వాజ్‌పేయి పేర్లు ఒక్క లక్నోలో మాత్రమే కనిపించడం గమనార్హం.

దేశంలోనే నాలుగవ రద్దీ అయిన మొఘల్‌సరారు జంక్షన్‌ పేరును దీన్‌ దయాళ్‌ ఉపాధ్యారు జంక్షన్‌గా మార్చారు. 2019 కుంభమేళాకు ముందు, రాష్ట్ర ప్రభుత్వం అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చింది. ఈ చారిత్రాత్మక ప్రాంతం అసలు పేరు ప్రయాగ్‌రాజ్‌ అని, మొఘలులు అలహాబాద్‌గా మార్చారని కాషాయమూకలు వాదిస్తున్నాయి. ఫైజాబాద్‌ పేరును అయోధ్యగా, ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు రాణి లక్ష్మీ బాయిగా మార్చారు.

ఇటీవల అలీగఢ్‌ పేరును హరిగఢ్‌గా మార్చాలంటూ మునిసిపల్‌ బాడీలు తీర్మానాన్ని ఆమోదించాయి. ఫిరోజాబాద్‌ను చంద్ర నగర్‌గా మార్చాలని ప్రతిపాదించారు. తన సొంత జిల్లా సంభాల్‌ పేరును పృథ్వీరాజ్‌ నగర్‌ లేదా కల్కి నగర్‌గా మార్చాలని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి గులాబ్‌ దేవి డిమాండ్‌ చేశారు. సుల్తాన్‌పూర్‌ జిల్లాను కుష్‌భవన్‌పూర్‌గా మార్చాలని బిజెపి మాజీ ఎమ్మెల్యే దేవమణి ద్వివేది పేర్కొన్నారు. ఈ నగరాన్ని శ్రీరాముడి కుమారుడు కుశుడు స్థాపించాడంటూ మరో వాదన తెరపైకి తీసుకువచ్చారు. సహరాన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌ అసెంబ్లీ స్థానానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే బ్రజేష్‌ సింగ్‌ కూడా దేవ్‌ బంద్‌ను దేవవ్రింద్‌గా మార్చాలని పట్టుబడుతున్నారు.

➡️