- మనవడు ప్రజ్వల్పై మాజీ పధాని దేవెగౌడ
బెంగళూరు : మాజీ ప్రధాని దేవెగౌడ తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కేసుకు సంబంధించి తొలిసారి స్పందించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రజ్వల్ రేవణ్ణపై నేరం రుజువైతే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోండి. దేశంలో చట్టప్రకారం న్యాయం జరగాలి. ప్రజ్వల్ రేవణ్ణపై ప్రభుత్వం న్యాయపరమైన మార్గాలను అనుసరించాలి. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారికి న్యాయం జరిగేలా సమగ్ర దర్యాప్తు జరగాలి. చట్టపరమైన విధానాలకు కట్టుబడి ఉండాలి. నా కుమారుడు హెచ్డి రేవణ్ణపై లైంగిక దాడి, కిడ్నాప్ కేసులు కావాలని బనాయించినవే. ఈ కేసులో చాలామంది ప్రమేయం ఉంది. బాధిత మహిళలందరికీ న్యాయం జరుగుతుంది. హెచ్డి రేవణ్ణకు సంబంధించిన కేసు కోర్టులో ఉంది. అందుకే దీనిపై నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు.’ అని అన్నారు. హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడికి పాల్పడిన వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసు దర్యాప్తు చేస్తోంది.