న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో సారి ‘భారత్ న్యారు యాత్ర ‘కు సిద్ధమయ్యారు. జనవరి 14 నుండి ‘మణిపూర్ టు ముంబయి’ వరకు 6,200 కిలోమీటర్లు రాహుల్ గాంధీ పర్యటన చేపట్టనున్నట్లు బుధవారం సంబంధిత వర్గాలు ప్రకటించాయి. ఇటీవల కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ సారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు ‘భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నటు తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. మణిపూర్ నుండి ముంబయి వరకు మొత్తం 6,200 కి.మీ మేర దీనిని నిర్వహించనున్నట్లు తెలిపారు.
మణిపూర్ నుండి మొదలయ్యే ఈ న్యాయ యాత్ర.. నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్రకు చేరనుంది. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్ యాత్ర జరగనుంది.