ముంబయి : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇండియా ఫోరంలోని ప్రతిపక్ష పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆప్, సమాజ్ వాదీ పార్టీలతో కాంగ్రెస్ సీట్ల ఒప్పందాలను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలోని 48 సీట్లలో ఎనిమిది స్థానాలపై నెలకొన్న అనిశ్చితిపై చర్చించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు గురువారం ఫోన్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాహుల్ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. దీంతో గురువారం ఉద్ధవ్తో సుమారు గంటసేపు మాట్లాడినట్లు సమాచారం.
ముంబయిలోని ఆరు లోక్సభ స్థానాల్లో ముంబయి సౌత్ సెంట్రల్, ముంబయి నార్త్ వెస్ట్లలో మూడింటిలో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆవర్గాలు తెలిపాయి. ముంబయిలోని నాలుగు స్థానాలు సహా రాష్ట్రంలోని 18 లోక్సభ స్థానాల్లో ఉద్థవ్ థాకరే పోటీ చేయాలనుకుంటున్నటుల తెలుస్తోంది. ఉద్ధవ్ థాకరే ముంబయి సీట్లలో అధిక స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. సీట్ల సర్దుబాటుపై రాహుల్, శరద్ పవార్ ఇప్పటికే ఫోన్లో చర్చలు జరిపారు. ఎంవీఏ కూటమి లోక్సభ సీట్ల సర్దుబాటు చివరి దశకు చేరుకుందని కాంగ్రెస్ వెల్లడించింది.
2019 లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి శివసేన పార్టీ (షిండే వర్గం చీలక ముందు) 22 నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. 18 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపితో 25 ఏళ్ల పొత్తును విఫలం చేస్తూ.. కాంగ్రెస్, ఎన్సిపిలతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం శివసేన చీలిపోవడంతో ఆ ప్రభుత్వం కూలిపోయింది. షిండే వర్గం బిజెపితో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో శరద్ పవార్ ఎన్సిపిలోనూ చీలికలు ఏర్పడ్డాయి. అజిత్ పవార్ వర్గం షిండే-బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో చేరింది. ఈ ఫిరాయింపులు మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీల మధ్య సీట్ల చర్చలను క్లిష్టతరం చేశాయి.