ఒపిఎస్‌ అమలుచేయకుంటే మే 1 నుంచి రైళ్ల బంద్‌ : రైల్వే యూనియన్ల ఐక్యవేదిక హెచ్చరిక

న్యూఢిల్లీ : పాత పెన్షన్‌ పథకం (ఒపిఎస్‌)ను పునరుద్ధరించకపోతే మే 1 నుంచి అన్ని రైళ్ల సర్వీసులనూ నిలిపివేస్తామని వివిధ రైల్వే ఉద్యోగుల, కార్మికుల సంఘాల ఐక్య వేదిక జాయింట్‌ ఫోరం ఫర్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జెఎఫ్‌ఆర్‌ఒపిఎస్‌) హెచ్చరించింది. ‘నూతన పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పిఎస్‌) స్థానంలో ‘నిర్వచించబడిన హామీతో కూడిన పాత పెన్షన్‌ స్కీమ్‌’ను పునరుద్ధరించాలని మేము ఎంతో కాలంగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పడు ప్రత్యక్ష చర్యకు దిగడం మినహా మరో మార్గం లేదు’ అని జెఎఫ్‌ఆర్‌ఒపిఎస్‌ కన్వీనర్‌, ఆల్‌ ఇండియా రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్‌ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. ‘జెఆఫ్‌ఆర్‌ఒపిఎస్‌ ఆధ్వర్యాన వివిధ ఫెడరేషన్ల ప్రతినిధులు సంయుక్తంగా ఈ నెల 19న అధికారికంగా రైల్వే మంత్రిత్వ శాఖకు సమ్మె నోటీసు అందజేస్తారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడే నాటి నుంచి దేశవ్యాప్త సమ్మెకు వెళ్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు.

ఈ సమ్మెలో రైల్వే ఉద్యోగులు, కార్మికులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు, సంఘాలు కూడా పాల్గొంటాయని మిశ్రా తెలిపారు. సమ్మె నోటీసును ఇవ్వడానికి అన్ని రాజ్యాంగ సంస్థలు తగు చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల సన్నాహాలు చేయాలని జెఆఫ్‌ఆర్‌ఒపిఎస్‌ కోరింది. ఒపిఎస్‌ కార్మికుల ప్రయోజనాల కోసం ఉద్దేశించిందని, నూతన పెన్షన్‌ పథకం ఉద్యోగుల, కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోదని మిశ్రా విమర్శించారు.

➡️