గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని బిజెపి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులు అధ్వాన్నంగా తయారయ్యాయి. గ్వాలియర్ నగరంలోని కమల రాజా ఆస్పత్రిలో ఓ వార్డులో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది గ్వాలియర్లోని ప్రభుత్వ గజ్ర రాజా మెడికల్ కాలేజీ కింద మహిళలు మరియు పిల్లల వైద్య సదుపాయం కల్పిస్తున్న కమల రాజా ఆస్పత్రిలోని వార్డుగా పేర్కొంది.
రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్ మంగళవారం ఎక్స్లో ఈ వీడియోని షేర్ చేసింది. ‘పేషెంట్ల కన్నా ఎలుకలు ఎక్కువ ‘ అంటూ పోస్ట్ చేసింది. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వ హయాంలో వైద్య సదుపాయాల తీరుపై విమర్శలు గుప్పించింది. ” రోగులను మరియు నవజాత శిశువులను ఎలుకల నుండి రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రిని దేవుడే రక్షించాలి. ముఖ్యమంత్రి పార్చివాలే రోజూ తన దర్బార్లో హాజరు నమోదుచేసుకుంటున్నారు ” అని ఎద్దేవా చేసింది.
‘వికసిత్ భారత్’ అంటూ నిత్యం ఊదరగొడుతున్న మోడీ ప్రభుత్వంలోని డొల్లతనాన్ని ఈ వీడియో బట్టబయలు చేస్తోంది. వికసిత్ భారత్ అంటే ఇదేనా పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ వీడియోపై స్పందిస్తూ .. ఎలుకల నివారణ కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆస్పత్రి సూపరింటెండెట్ని ఆదేశించినట్లు మెడికల్ కాలేజీ డీన్ ఆర్కెఎస్ దాకడ్ ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.