‘జ్ఞాన్‌వాపి’లో పూజకు అనుమతించిన రిటైర్డ్‌ జడ్జికి పదవి

  • యుపిలోని ఒక యూనివర్సిటీకి లోక్‌పాల్‌గా నియామకం
  • తీర్పునిచ్చిన నెలలోపే ఇదంతా

న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) రంజన్‌ గొగోరు.. తన పదవీ విరమణానంతరం రాజ్యసభ ఎంపీ అయ్యారు. పదవీ విరమణ దగ్గర పడుతున్న తరుణంలో సున్నితమైన అయోధ్య-బాబ్రీ మసీదు విషయంలో ఒక వర్గానికి అనుకూలంగా, ఒక పార్టీకి బలం చేకూరేలా తీర్పునిచ్చారనీ, అందుకు ప్రతిఫలంగానే ఆయనకు రాజ్యసభ సీటు వరించిందని ఆ మధ్య వాదనలు వినిపించాయి. ఇప్పుడు వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు విషయంలోనూ ఇదే సీన్‌ రిపీట్‌ అయినట్టు కనిపిస్తున్నది. మసీదు బేస్‌మెంట్‌ను హిందువులకు పూజల కోసం తన ఉద్యోగ జీవితంలో చివరి రోజున అప్పగించిన నెలలోపే.. రిటైర్డ్‌ జడ్జి అజయ కృష్ణ విశ్వేషా లక్నోలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి అంబుడ్స్‌ మెన్‌గా నియమితులయ్యారు. విశ్వేషా జనవరి 31న వారణాసి జిల్లా న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.ఫిబ్రవరి 27న.. డాక్టర్‌ శకుంతలా మిశ్రా నేషనల్‌ రిహాబిలిటేషన్‌ యూనివర్సిటీ (ఇది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయం) లోక్‌పాల్‌ (అంబుడ్స్‌మన్‌)గా నియమించినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. విశ్వేషా ఈ పదవిలో మూడేండ్ల పాటు ఉంటారు. యూనివర్సిటీ లోక్‌పాల్‌ విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించే బాధ్యతను కలిగి ఉంది. విశ్వేషా మూడేండ్లపాటు లోక్‌పాల్‌గా నియమితులైనట్టు యూనివర్సిటీ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ బ్రిజేంద్ర సింగ్‌ ధృవీకరించారు.

సమాజంలోని రెండు మతాల మధ్య సున్నితమైన అంశంలో తీర్పునిచ్చిన వ్యక్తిని ఇప్పుడు అంబుడ్స్‌మన్‌గా నియమించటం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కారు పరోక్షంగా న్యాయవ్యవస్థను సైతం ప్రభావితం చేస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కీలక కేసుల్లో ‘ప్యాకేజీ తీర్పులు’ వెలువడుతున్నాయనీ, పదవీ విరమణ అనంతరం సదరు న్యాయమూర్తులకు కీలక పదవులు వరిస్తున్నాయని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️