కుల గణనపై ఆరెస్సెస్ వ్యతిరేకత
బిజెపి దారిలోనే సంఫ్ు
న్యూఢిల్లీ: దేశంలోని కుల గణనకు మోడీ సర్కారు ఇప్పటికే తన వ్యతిరేకతను తెలిపింది. ఇప్పుడు అదే దారిలో బిజెపి మాతృ సంస్థ ఆరెస్సెస్ కూడా నడుస్తున్నది. కుల గణనను వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీ మాట్లాడిన కొద్ది రోజులకే.. ఆరెస్సెస్ దీనిపై తన అభిప్రాయాన్ని తెలిపింది. కుల గణన అనేది జాతీయ ఐక్యతను బలహీన పరిచే చర్య అనీ, దేశానికి దాని అవసరం లేదని వెల్లడించింది. నాగ్పూర్ ప్రధాన కార్యాలయంలో బిజెపి, దాని మిత్ర పక్షం శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) మహారాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యేల బృందంతో జనాభా గణన అవసరానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్ విదర్భ చీఫ్ శ్రీధర్ గాడ్గే మాట్లాడారు. కుల గణన రాజకీయంగా కొంతమందికి ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. కానీ అది జాతీయ ఐక్యతకు మంచిది కాదని చెప్పారు. దీంతో ఆరెస్సెస్ చేతిలో ఉండే బీజేపీ కుల గణను ఏ మాత్రమూ చేపట్టబోదనీ, ఇందుకు సంఫ్ు నుంచి వ్యతిరేకతే నిదర్శనమని నిపుణులు అంటున్నారు. సోమవారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో జరిగిన బహిరంగ సమావేశంలో ప్రధాని మోడీ కుల గణనకు వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత గాడ్గే చేసిన ప్రకటన రావటం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, బలహీన వర్గాలకు చెందిన సంఘాలు కుల గణనకు డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.