- పదేళ్లు సర్వీసున్నవారికి రూ.వెయ్యి,
- మిగిలిన అందరికీ రూ.500 చొప్పున పెంపుదల
- డిసెంబర్ 2023 నుంచే అమల్లోకి
- 60 వేల మంది సిబ్బందికి లబ్ది
తిరువనంతపురం : కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీలకు వేతనాలు పెంచినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి బాలగోపాల్ తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 60 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. పదేళ్ల సర్వీసు దాటిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.1,000 చొప్పున పెంచినట్లు తెలిపారు. మిగిలిన వర్కర్లు, హెల్పర్లకు రూ.500 చొప్పున పెంచినట్లు చెప్పారు. జీతాల పెంపు 2023 డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చింది. జీతాల పెంపుపై అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలకు అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రాల్లో కేరళ ఇప్పటికే ఒకటిగా ఉంది.