న్యూఢిల్లీ : శరద్పవార్ నేతృత్వంలోని గ్రూపునకు పార్టీ పేరుగా ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్’ ను ఎన్నికల కమిషన్ బుధవారం కేటాయించింది. గతేడాది జులైలో మెజారిటీ ఎన్సిపి ఎంఎల్ఎలతో మహారాష్ట్ర అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన అజిత్ పవార్ నేతృత్వంలోని గ్రూపునకు మంగళవారం ఎన్సిపి పేరును, గడియారం గుర్తును ఇచ్చిన ఎన్నికల కమిషన్ బుధవారం పై ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలో త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు పేర్లు సూచిస్తే ఒక పేరును కేటాయిస్తామని శరద్ పవార్ గ్రూపును కమిషన్ కోరింది. దాంతో శరద్ పవార్ గ్రూపు – ఎన్సిపి శరద్చంద్ర పవార్, ఎన్సిపి శరద్రావు పవార్, ఎన్సిపి శరద్ పవార్’ లను సూచించింది. మర్రి చెట్టును ఎన్నికల గుర్తుగా ఇవ్వాలని ఈ గ్రూపు కోరింది. మొదటి ప్రాధాన్యత అయిన ఎన్సిపి శరద్చంద్ర పవార్ను కేటాయిస్తున్నట్లు కమిషన్ తెలియచేసింది.