-ఓటు వేయడానికి వచ్చి వడదెబ్బకు ముగ్గురు మృతి
ప్రజాశక్తి – చెన్నయ్ ప్రతినిధి
తమిళనాడులో శుక్రవారం లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పాండిచ్చేరి సహ 40 లోక్సభ స్థానాలకు ఉదయం 7 నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ పోలింగ్ జరిగింది. రాత్రి ఏడు గంటలకు 72.09 శాతంగా పోలింగ్ నమోదైంది.
చెన్నరు మెట్రోపాలిటిన్ సిటీలో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధురైలో సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు రామకృష్ణ దంపతులు, ఎంపి అభ్యర్థి సు.వెంకటేశన్, దిండిగల్ సిపిఎం అభ్యర్థి ఆర్.సచ్చిదానందన్ ఓటు వేశారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా తన హక్కు వినియోగించుకున్నారు. దక్షిణ చెన్నరులో తమిళనాడు మాజీ గవర్నర్, ఎంపి అభ్యర్థి తమిళసై సౌందర్యరాజన్ ఓటు వేశారు. రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా వడదెబ్బకు ముగ్గురు వృద్ధులు మృతి చెందారు. కల్లకుర్చి, తిరుమని, సేలంలలో ఈ ఘటనలు చోటు చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 950 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పాండిచ్చేరిలో ఒక్క ఎంపి సీటుకు అత్యధికంగా 26 మంది పోటీలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 68,321 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి సత్యప్రద సాహు తెలిపారు. వాటిలో 8,050 స్టేషన్లు సమస్యాత్మకంగా, 150 అత్యంత సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.