రాంచీ : ఇన్సులిన్ ఇవ్వకుండా తన భర్తను జైల్లో హత్య చేసేందుకు బిజెపి యత్నిస్తోందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. బిజెపి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి పోరాడి విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం రాంచీలో జరిగిన ‘ఉల్గులన్ న్యారు ర్యాలీ’ లో ఆమె మాట్లాడారు.
” నా భర్త అరవింద్ కేజ్రీవాల్ని చంపాలనుకుంటున్నారు. అతని ఆహారంపై నిఘా ఉంచారని, ఇన్సులిన్ అందించడం లేదు. నా భర్త 12 సంవత్సరాలుగా ఇన్సులిన్ తీసుకుంటున్నారు. ఆయనకు రోజుకి 50 యూనిట్ల ఇన్సులిన్ అవసరం” అని అన్నారు. ప్రజలకు సేవచేసిందుకు తన భర్తను జైలుపాలయ్యారని మండిపడ్డారు. నేరం రుజువు కాకుండానే కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లను జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియంతృత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తాము విజయం సాధిస్తామని, జైలు గేట్లు పగలగొట్టి కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లు బయటకు వస్తారని అన్నారు.
రాంచీలో జరిగిన ఈ భారీ బహిరంగ సభకు హేమంత్సోరెన్ భార్య సునీతా సోరెన్, జెఎంఎం శిబు సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆర్జెడి నేత తేజస్వీయాదవ్, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు హాజరయ్యారు.