కాశ్మీర్‌ వేర్పాటువాద సంస్థ తెహ్రీక్‌ -ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం

Dec 31,2023 15:18 #Amit Shah, #banned, #Tehreek-e-Hurriyat

న్యూఢిల్లీ :   జమ్ము కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ  తెహ్రీక్‌-ఎ- హురియత్‌ (టిఇహెచ్‌)  కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిషేధం విధించింది. జమ్ముకాశ్మీర్‌లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు ఈ సంస్థ కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని, తీవ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు గుర్తించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఉగ్రవాదంపై ప్రధాని మోడీ అనుసరిస్తున్న ‘జీరో టోలరెన్స్’ పాలసీ  ప్రకారం.. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి లేదా సంస్థనైనా అడ్డుకుంటామని అన్నారు. ”చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద తెహ్రీక్‌-ఎ-హురియత్‌ జెకెను చట్టవిరుద్ధ సంఘంగా ప్రకటించారు. భారత్‌ నుండి జమ్ముకాశ్మీర్‌ను వేరు చేసి ఇస్లామిక్‌ పాలనను స్థాపించేందుకు ఈ సంస్థ నిషేధిత కార్యకలాపాలలో పాల్గొంటోంది” అని అమిత్‌షా ఎక్స్‌ లో పేర్కొన్నారు.

టిఇహెచ్‌కి గతంలో వేర్పాటు వాద నేత సయ్యద్‌ అలీ షా గిలానీ నాయకత్వం వహించారు. ఆయన మృతి అనంతరం మసరత్‌ ఆలం భట్‌ బాధ్యతలు చేపట్టారు. భట్‌పై భారత వ్యతిరేకి మరియు పాకిస్థాన్‌ అనుకూల ప్రచారాలను చేపడుతున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం భట్‌ జైలులో ఉన్నాడు. అతని పార్టీ ముస్లిం లీగ్‌ ఆఫ్‌ జమ్ముకాశ్మీర్‌ను డిసెంబర్‌ 27న కేంద్రం నిషేధిత సంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

➡️