- స్పైస్ జెట్ విమానంలో ప్రయాణికుడికి చేదు అనుభవం
బెంగళూరు : బెంగళూరు వెళ్లేందుకు విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. టాయిలెట్ డోర్ లాక్ తెరుచుకోకపోవడంతో ఆయన తన గమ్యం చేరేదాకా అందులోనే చిక్కుకుపోయాడు. మంగళవారం ముంబై నుంచి బెంగళూరు బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు స్పైస్ జెట్ విమానం ఎస్ జి- 268 బెంగళూరు బయలుదేరింది. టేకాఫ్ అయిన తర్వాత ఓ ప్రయాణికుడు టాయిలెట్కు వెళ్లాడు. అయితే, మాల్ ఫంక్షన్ కారణంగా డోర్ తెరుచుకోకపోవడంతో లోపలే చిక్కుకు పోయాడు. డోర్ తెరిచేందుకు బయట నుంచి ఫ్లైట్ సిబ్బంది చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. దీంతో ఎయిర్ హౌస్టెస్ ఓ కాగితంపై నోట్ రాసి డోర్ కింది నుంచి లోపలికి పంపింది. డోర్ బయటి నుంచి కూడా తెరుచుకోవడంలేదని, విమానం ల్యాండయ్యాక ఇంజనీర్లు వచ్చి డోర్ తెరుస్తారని పేర్కొంది. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండయ్యాక ఇంజనీర్లు వచ్చి డోర్ పగలగొట్టి ప్రయాణికుడిని బయటకు తీశారు. తీవ్ర ఆందోళనకు గురైన ఆ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.