- బెంగాల్లో73.14శాతం.. మహారాష్ట్రలో 53.5శాతం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్సభ ఎన్నికల అయిదవ విడత పోలింగ్ పేలవంగా జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 లోక్సభ నియోజక వర్గాలకు, ఒడిశా అసెంబ్లీకి సోమవారం పోలింగ్ నిర్వహించారు. కడపటి సమాచారం ప్రకారం 59 శాతం ఓట్లు పోలయ్యాయి. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 73.14 శాతం, మహారాష్ట్రలో అత్పల్పంగా 53.5 శాతం ఓట్లు పోలయ్యాయి. బీహార్లో 52.60 శాతం, జార్ఖండ్లో 63 శాతం, ఒరిస్సాలో 60.72 శాతం, ఉత్తరప్రదేశ్లో 57.79 శాతం, జమ్మూకాశ్మీర్లో 54.49 శాతం, లఢక్లో 67.15 శాతం పోలింగ్ నమోదైంది.
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ యుపిలోని రాయబరేలి నియోజక వర్గంలో పోలింగ్ బూత్లను పరిశీలించారు. పశ్చిమ బెంగాల్లోని బరాక్పూర్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి, ఎంపి అర్జున్ సింగ్కు టిఎంసి కార్యకర్తలు నల్లజెండా చూపించి నిరసన తెలిపారు. ఐదు దశల్లో 428 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది.
తరలివచ్చిన సినీ తారలు, కార్పొరేట్ దిగ్గజాలు
ఐదో దశ పోలింగ్లో సినీ తారలు, కార్పొరేట్ దిగ్గజాలు, క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్, టాటా గ్రూప్ అధినేత రతన్టాటా, మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్ర, రిలయన్స్ ఇండిస్టీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, ఛైర్పర్సన్ నీతూ అంబానీ, ఆదిత్య బిర్లా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, హెచ్డిఎఫ్ సి చైర్మన్ దీపక్ పరిక్, జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమిర్ ఖాన్, కిరణ్రావ్, సైఫ్ అలీ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, బాబీ డియోల్, అమితాబ్ బచ్చన్, ఎంపి జయా బచ్చన్, యాక్టర్స్ తమన్నా భాటియా, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, శిల్పా శెట్టి, షమితా శెటా?న్, అమ్రిత సింగ్, కరీనా కపూర్, రచయిత జావేద్ అక్తర్, నటి షబానా అజ్మీ, నటులు జాకీ భగ్నానీ, ఆయన భార్య, నటి రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు డేవిడ్ ధావన్, నటుడు వరుణ్ ధావన్, నటుడు కొంకణా సేన్ శర్మ, నటుడు, దర్శకుడు అర్బాజ్ ఖాన్, సంజరు దత్, అక్షరు కుమార్, అనిల్ కపూర్, హృతిక్ రోషన్, రాకేష్ రోషన్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. బిఎస్పి అధినేత్రి మాయావతి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, శివసేన (యుబిటి) అధినేత ఉద్దవ్ థాకరే, మహారాష్ట్ర సిఎం ఏక్నాథ్ షిండే తన కుటుంబాలతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.