చెన్నై : తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి మంగళవారం నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటకులు తమ వివరాలు, వాహనాల నంబరు, వచ్చే రోజు, బస చేసే రోజులు, బస చేసే చోటు వంటి వివరాలను ఆన్లైన్ ద్వారా వెల్లడించి ఈ-పాస్ పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఊటీ, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులు, వ్యాపారులు వివరాలను epass.tnega.org వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి ఈ-పాస్ పొందొచ్చు. వాహన రద్దీని క్రమబద్ధీకరించడానికే ఈ విధానం అమలు చేసినట్టు, దీని వల్ల పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానం జూన్ 30 వరకు మాత్రమే అమలులో ఉంటుందని వెల్లడించింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/KODIKENAL.jpg)