అమరావతి: రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ చర్చించారు. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. జనసేన పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే వీరిద్దరూ ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. రాజానగరం, రాజోలు స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్లు ఇటీవల పవన్ ప్రకటించగా.. మిగతా స్థానాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశముంది. అభ్యర్థుల ఎంపికపై హైదరాబాద్లో గత నాలుగురోజులుగా ఇరు పార్టీల అధినేతలు వేర్వేరుగా కసరత్తు చేశారు. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలకు ఇప్పటికే చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పొత్తులో సీటు సర్దుబాటు కాని నేతలకు పార్టీ, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/3-7.jpg)