– శంఖారావం సభల్లో టిడిపి నేత లోకేష్
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :వైసిపి నాయకులు చొక్కా మడతపెడితే…. టిడిపి, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతపెడతారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి స్కీమ్ వెనుకా ఒక స్కామ్ ఉందని విమర్శించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన శంఖారావం సభల్లో ఆయన ప్రసంగించారు. రాజధాని ఫైల్స్ సినిమా గురించి తెలిశాక జగన్కు భయం పట్టుకుందని, అందుకే ఆ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. యాత్ర-2 సినిమా వైసిపికి అంతిమయాత్రలా మారిందని, రాజధాని ఫైల్స్ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపారని విమర్శించారు. రాజధాని విషయంలో జగన్మోహన్రెడ్డి ఎన్నో యూ టర్న్లు తీసుకుని అటు రైతులను, ఇటు ప్రజలను మోసం చేశారన్నారు. అమరావతి రాజధానికి మద్దతిస్తామని నమ్మించి, మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే ఈ ఐదేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రాజధాని నిర్మించడం చేతకాక వైవి సుబ్బారెడ్డి రాజధానిగా హైదరాబాద్ మరో ఐదేళ్లు కావాలనడం సిగ్గుచేటన్నారు. ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్ అని అంటున్న జగన్… సమయం, తేదీ చెబితే గృహిణులు, నిరుద్యోగ యువత, మద్యం ప్రియుల వద్ద చర్చకు తాము సిద్ధమేనన్నారు. నాసిరకం మద్యం, గంజాయితో యువతీ, యువకుల ప్రాణాలతో ముఖ్యమంత్రి చలగాటమాడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే గంజాయి లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతానన్న జగన్ మాట తప్పి మరో అవకాశం ఇవ్వమంటున్నాడని విమర్శించారు. జగన్ ప్రవేశపెట్టిన ప్రతి స్కీమ్ వెనుకా ఓ స్కాం దాగి ఉంటుందన్నారు. సెంటు స్థలాల పేరుతో రూ.7 వేల కోట్లు, లెవలింగ్ పేరుతో రూ.2200 కోట్లు దోచేశారని ఆరోపించారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాకు ఉత్తరాంధ్రను కేంద్రంగా మార్చారని విమర్శించారు. రెండు నెలలు ఆగితే వైసిపి దోచుకున్న సొమ్మును వడ్డీతో సహా కక్కిస్తామన్నారు. జగనన్న ఇళ్లు చేతితో తాకితేనే కూలిపోయే పరిస్థితి ఉందని, టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెరుగైన టెక్నాలజీతో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ కేన్సర్ ఆస్పపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకే బాబు-పవన్ కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సభల్లో టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు పి.అశోక్గజపతిరాజు, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున, ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జులు పాల్గొన్నారు.