ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదోతరగతి పరీక్షల విద్యార్థుల హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్లో పొందుపరచనుంది. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు డి దేవానందరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. www.bse.ap.gov.in వెబ్సైట్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలల్లో లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని వెల్లడించారు. స్కూల్ కోడ్, పాస్వర్డ్, విద్యార్థి పుట్టిన రోజు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఈ నెల 18 నుంచి 30 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు.