- అజిత్ సింగ్నగర్లో ఇంటింటి ప్రచారం
ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ (విజయవాడ) : మార్పు కోసం సిపిఎం పాదయాత్ర అజిత్ సింగ్నగర్ చెత్త ఫ్యాక్టరీ వెనుక జి ప్లస్ త్రీ, 60, 61 డివిజన్లలో జరిగింది. ఇంటింటికీ ప్రచారం భాగంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి సిహెచ్.బాబురావు మాట్లాడుతూ.. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలందరూ సిపిఎం ఒక ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే ప్రజల తరపున పోరాడి సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. గతంలో సింగ్ నగర్ ఫ్లైఓవర్ కట్టడం కోసం కృషి చేసింది సిపిఎం మాత్రమే అని తెలిపారు. డిస్నీల్యాండ్లో 57 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబేళాలకు కార్పొరేటర్ వ్యవస్థకు కట్టబెట్టడం దారుణమన్నారు. ప్రజలకు ఇంటి స్థలాలు లేక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం మాత్రం కబేళాకు ఇవ్వటం దారుణమన్నారు. డిస్నీలాండ్ 57 ఎకరాలు ప్రజలకు ఇవ్వాలని లేకపోతే అర్హులైన పేద ప్రజలు ఆక్రమించుకుంటారని హెచ్చరించారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న టెక్నో ఇల్లు పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జక్కంపూడి, సింగ్నగర్లో జి ప్లస్ త్రీ అపార్ట్మెంట్లలో ఖాళీలు ఉన్నాయని వాటిని పేద ప్రజలకు ఇవ్వాలని.. నిరుపయోగంగా ఉండటం వలన మందు బాబులకు బ్లేడ్ బ్యాచ్కి నిలయంగా మారాయని తెలిపారు. సిపిఎం అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే సింగ్నగర్ రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని వాంబే కాలనీ ఇళ్ల స్థలాలకు పట్టాలిస్తామని అద్దెకు ఉండే వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. డిస్నీల్యాండ్లో పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని, సింగ్ నగర్ నుండి కండ్రిక, రాజీవ్నగర్, పాయకాపురం మంచినీటి సమస్యను తీరుస్తామని ఇంటిపట్టలేని వారికి పట్టాలు ఇప్పిస్తామన్నారు. సిపిఎం అభ్యర్థిని గెలిపిస్తే ఒక్క నెలలోనే చెప్పిన వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ కార్యదర్శి బి.రమణారావు, అధ్యక్షులు కే.దుర్గారావు సిపిఎం నాయకులు ఎస్కే.పేరు, నజీముద్దీన్, బాబురావు, సిహెచ్ శ్రీనివాస్, ఝాన్సీ, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.