హైదరాబాద్ : స్కూలు బస్సు కింద పడి రెండేళ్ల పాప అక్కడికక్కడే చనిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్లోని హబ్సిగూడలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హబ్సిగూడలోని రవీంద్రనగర్కు చెందిన ఓ వ్యక్తి తన కొడుకును స్కూలు బస్సు ఎక్కించేందుకు తీసుకెళ్లాడు. రెండేళ్ల పాప పరుగులు పెడుతూ అన్న వెంటపడింది. తండ్రి వెనక వస్తుండగా పిల్లలు ఇద్దరూ ముందు నడిచారు. స్కూలు బస్సు రావడంతో బాబు జాగ్రత్తగా ఎక్కాడు.. బాబు ఇలా ఎక్కీఎక్కగానే డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో పాప బస్సు టైర్ కింద పడి నలిగిపోయింది. తీవ్ర గాయాలతో ఘటన స్థలంలోనే మృతి చెందింది. కళ్ల ముందే కూతురు చనిపోవడంతో ఆ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.