- ఎస్సిఎస్కు 104, 108 ఉద్యోగుల సమ్మె నోటీసు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అనేక సంవత్సరాలుగా వైద్యారోగ్యశాఖలో సేవలందిస్తున్న తమ న్యాయమైన సమస్యలు ఈ నెల 22లోపు పరిష్కరించాలని, లేనిపక్షంలో 23 నుంచి సమ్మె చేపడతామని ఎపి 108 సర్వీసెస్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు అందజేసింది. ఈ మేరకు నాయకులు ఎవి నాగేశ్వరరావు, కిరణ్కుమార్, కెవి నరసింహారావు, ఆర్ శ్రీనివాసరావు, ఎం శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. సమ్మెకు సన్నాహకంగా తొమ్మిదో తేదీ నుండి 22 వరకూ చేపట్టనున్న కార్యాచరణ ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ 104 ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్ కూడా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చింది. సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో ఎవి నాగేశ్వరరావు, విఆర్ ఫణికుమార్, ఎం కృష్ణారెడ్డి, సిహెచ్ రాంబాబు ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎజ్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేదని నోటీసుల్లో పేర్కొనడంతోపాటు కార్యాచరణనూ ప్రకటించారు.