అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల 40 లక్షలు సీజ్‌…

May 2,2024 18:15 #East Godavari, #money sized, #police

ప్రజాశక్తి-గోపాలపురం: హైదరాబాద్‌ నుండి రాజమండ్రి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో ఎటువంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల 40 లక్షలు రూపాయలు జగన్నాధపురం చెక్పోస్ట్‌ వద్ద సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ కె.సతీష్‌ కుమార్‌ తెలిపారు. గురువారం ఎస్‌ఐ కె.సతీష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం మండలంలోని జగన్నాధపురం వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ పోలీస్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో రెండు బ్యాగులలో సుమారు 2 కోట్ల 40 లక్షల రూపాయల నగదు ఎటువంటి సరైన పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి చెక్‌ పోస్ట్‌ సిబ్బంది నగదును సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లా అంతట 21 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 24 స్టాటిక్‌ సర్వే లెన్స్‌ టీములు మరియు 15 ఇంటిగ్రేటెడ్‌ పోలీస్‌ చెక్‌ పోస్ట్లు ఏర్పాటుచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు మరియు అక్రమ రవాణాకు తావు లేకుండా నిరంతర నిఘా ఉంచామని తెలిపారు. జిల్లా ప్రజలు కూడా తమవంతుగా ఎవరైనా ఇటువంటి అక్రమ రవాణాలకు పాల్పడినచో వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషనుకు గాని లేదా డయల్‌ 112 గాని ఫోన్‌ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

➡️