-పెత్తందారు జగన్ను ఓడించండి : బిటెక్ రవి
ప్రజాశక్తి – కడప అర్బన్ :పేదవాడికి పెత్తందారికి మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడికి ఓటు వేయాలని సిఎం జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారని, తన అఫిడవిట్లో రూ.750 కోట్ల ఆస్తులు చూపించారని, పులివెందుల ప్రజలు ఆలోచించి పేదవాడినైన తనకు ఓట్లు వేసి గెలిపించాలని టిడిపి పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాధ్రెడ్డి (బిటెక్ రవి) కోరారు. కడప ద్వారకానగర్లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. తన ఆస్తులు కేవలం రూ.80 లక్షలు మాత్రమేనని తెలిపారు. జగన్ తన నామినేషన్కు డబ్బు, మద్యం ఎరచూపి జన సమీకరణ చేయడాన్ని బట్టి చూస్తే ఇది ఓటమికి సంకేతమన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని చెప్పారు. వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారని సిఎం జగన్ చెప్పడం అవకాశవాద రాజకీయమని విమర్శించారు. వివేకా హత్యలో ఎంపి అవినాష్రెడ్డి ప్రవేయం ఉందని సిబిఐ తన దర్యాప్తులో పేర్కొందన్నారు. వైఎస్ను విమర్శించిన మీడియాను షర్మిల వెనకేసుకు వస్తోందని సిఎం మాట్లాడుతున్నారని, మరి వైఎస్ రాజశేఖర్రెడ్డిని రిలయన్స్ వారు చంపినట్లు ఆరోపిస్తూ వారి ఆస్తులు ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించారు. జగన్ సిఎం అవుతానే అంబానీని ఇంటికి పిలిపించి ఆయన బంధువుకు రాజ్యసభ సీటు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. వైఎస్ ఆశయం రాహుల్ను ప్రధాన మంత్రి చేయడానికి షర్మిలా ప్రచారం చేస్తుందని చెప్పారు. సమావేశంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, మీడియా కో-ఆర్టినేటర్ జనార్థన్ పాల్గొన్నారు.