ఎపి పేపర్‌ మిల్లు లాకౌట్‌ ఎత్తివేత

Apr 26,2024 00:28 #AP Paper Mill Lockout, #Lifted

– నేటి నుంచి యథావిధిగా కార్యకలాపాలు
– కలెక్టర్‌ చొరవతో ఫలించిన చర్చలు
– ఇది కార్మికుల విజయం: సిఐటియు
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి :ఎపి పేపరు మిల్లు లాకౌట్‌ను ఎత్తివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు గురువారం నోటీసు బోర్డు ఏర్పాటు చేసింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఎాషిప్టు కార్మికులు యథావిధిగా విధులకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అధ్యక్షతన జిల్లా ఎస్‌పి, జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో యాజమాన్యం, మిల్లులోని మొత్తం 11 కార్మిక సంఘాలతో కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం చర్చలు జరిగాయి. సుమారు 2 గంటలపాటు జరిగిన ఈ చర్చల్లో కార్మిక సంఘాలు అనేక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. వీటిపై వారు సానుకూలంగా స్పందించారు. యాజమాన్యంతో జరిపిన చర్చల్లో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. కార్మికులు విధులకు హాజరైన 25 రోజుల్లో వేతన ఒప్పందంపై చర్చలు జరుపుతామని యాజమాన్యం తెలిపింది. ఎపి పేపర్‌ మిల్లు యాజమాన్యం చివరి సారిగా 2017లో కార్మికులతో వేతన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పంద కాలం 2020 జూన్‌తో ముగిసింది. గతంలో జరిగిన చర్చల్లో 2020ా2023 మధ్య కాలానికి వేతన ఒప్పందం చేయబోమంటూ మొండికేసిన యాజమాన్యం ఎట్టకేలకు దిగొచ్చింది. జిల్లా కలెక్టర్‌ సమక్షంలో 2020ా2023 కాలానికి వేతన ఒప్పందం కోసం రాత పూర్వక హామీ ఇచ్చింది. సమ్మె కాలంలో కార్మికులపై ఎలాంటి కక్ష పూరిత చర్యలు చేపట్టబోమని పేర్కొంది.
ఫలించిన ఐక్య పోరాటం : సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి. అరుణ్‌
వేతన ఒప్పందం కోసం కార్మిక సంఘాలు ఐక్యంగా చేసిన పోరాటం ఫలించింది. గత 23 రోజులుగా కార్మికులు ఐక్యంగా సమ్మె చేపట్టారు. ఇది కార్మికుల విజయం. 2020ా2023 మధ్య కాలంలోని వేతన ఒప్పందం చేసేందుకు యాజమాన్యం రాత పూర్వక హామీ ఇచ్చింది. కార్మికులకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరోసారి కార్మిక పోరాటం తప్పదని హెచ్చరించారు.

➡️