ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కృష్ణా జిల్లాలో అధికార వైసిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మచిలీపట్నం ఎంపి బాలశౌరి వైసిపి వీడి జనసేనలో చేరారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ సమక్షంలో బాలశౌరి, ఆయన కుమారుడు అనుదీప్ తదితరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్కల్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్కల్యాణ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, మద్యనిషేధం వంటి వాటిని అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.