15 నుంచి చేపల వేట నిషేధం

Apr 7,2024 21:22 #Bandh, #bapatla, #fishing

ప్రజాశక్తి-బాపట్ల :సముద్ర జలాల్లో ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకు చేపల వేట నిషేధం అమలు చేస్తున్నట్లు బాపట్ల మత్స్యశాఖ అధికారి రవీంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యాంత్రిక పడవలు, మేకనైజ్‌డ్‌, మోటారు బోట్ల ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటను 61 రోజుల పాటు ప్రభుత్వం నిషేధించిందని పేర్కొన్నారు. చేపల పునరుత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా మత్స్య సంపదను మరింత పెంపొందించేందుకు ఈ నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ మేరకు మత్స్యకారులు సహకరించాలని కోరారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన బోట్ల యజమానులకు ఆంధ్రప్రదేశ్‌ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టాన్ని అనుసరించి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే బోట్లు, మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. చేపలవేట నిషేధం సక్రమంగా అమలయ్యేందుకు మత్స్య శాఖ, కోస్ట్‌ గార్డ్‌, కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ నిర్వహిస్తారని తెలిపారు.

➡️