- రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం విధానం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు న్యాయస్థానం సమ్మతించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. అలాగే, విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబరులో హైదరాబాద్లోని కవిత నివాసంలోనే సిబిఐ అధికారులు ఆమెను మూడు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సిబిఐ అధికారులు కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. గతంలో తాము నమోదు చేసిన వాంగ్మూలం, అప్రూవర్గా మారినవాళ్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సిబిఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.