ప్రజాశక్తి- ధర్మవరం టౌన్ : అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. హిందూపురం రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు… ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీకి చెందిన నీలూరి రామాంజినేయులు (50) రెండు కూలి మగ్గాలు ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చేనేతలో నేసిన చీరకు గిట్టుబాటు ధర లభించలేదు. ముడిసరుకుల కోసం, కుటుంబ అవసరాల కోసం రూ.3.50 లక్షల వరకు అప్పులు చేశారు. వీటిని ఎలా తీర్చాలా అంటూ తరచూ తీవ్ర మనోవేదనకు గురయ్యేవారు. ఈ క్రమంలో కేతిరెడ్డి కాలనీ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే కీమెన్ గమనించి హిందూపురం రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రామాంజినేయులుకు భార్య సరోజమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/cheneetha.jpg)