ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రాన్ని వైసిపి రహితంగా మార్చాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమంలో భాగంగా టిడిపి కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. అయిదేళ్లుగా ప్రజలపై పన్నులు, ఛార్జీల బాదుడును జగన్ నిర్విరామంగా కొనసాగించారని అన్నారు. పోలవరం, అమరావతిని విధ్వంసం చేసి రాష్ట్ర బ్రాండ్ను దెబ్బతీశారని, వీటన్నింటిపై ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పారు. ఇసుక మాఫియా వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితి నెలకొందన్నారు. జగన్ బటన్ నొక్కానని డబ్బా కొట్టుకుంటున్నారని, బటన్ నొక్కడానికి జగన్ అవసరం లేదని అన్నారు. రైతు కూలీలను నట్టేట ముంచారని తెలిపారు. టిడిపి హయాంలో తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన తిండి గింజలు పండించేలా రైతులను ప్రోత్సహించామని చెప్పారు. పట్టిసీమను పూర్తిచేసి 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని పేర్కొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/chandrababu-3.jpg)