నేడు సిఎం జగన్‌ నామినేషన్‌

  •  ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి వైసిపి అభ్యర్థిగా నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సాధారణ ఎన్నికలకు ప్రచారంలో భాగంగా కడప జిల్లా నుంచి మేమంతా సిద్ధం పేరుతో సిఎం చేపట్టిన బస్సు యాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. గతనెల 27న మొదలైన బస్సు యాత్ర రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 86 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 2,100 కిలోమీటర్లు సాగింది. ఈ సందర్భంగా 16 భారీ బహిరంగ సభల్లో జగన్‌ మాట్లాడారు. అలాగే 9 ప్రాంతాల్లో రోడ్‌షోలను, ఆరు ప్రాంతాల్లో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. బుధవారం బస్సు యాత్ర ముగించుకున్న సిఎం గురువారం పులివెందులకు వెళ్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. తాడేపల్లి నుంచి ఉదయం పులివెందులకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మొదట మాట్లాడనున్నారు. అనంతరం నామినేషన్‌ వేసి తిరిగి సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు.

➡️