మళ్లీ విజయవాడకు రండి.. అంగన్వాడీలకు బేబీ రాణి పిలుపు

Jan 22,2024 18:57 #Anganwadi strike, #Vijayawada

ప్రజాశక్తి-అమరావతి : అరెస్టులు చేసి.. నిర్బందాలు చేసిన మళ్లీ విజయవాడ వచ్చి ఉద్యమం కొనసాగించి తీరుతామనిఅంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షులు జీ.బేబీ రాణి పేర్కొన్నారు. స్టేషన్‌ నుంచి వదిలిన వెంటనే మళ్లీ విజయవాడ తరలిరావాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ ఉద్యోగుల జగనన్నకు చెప్పుకుందాం కార్యక్రమం సందర్భంగా పోలీసులు ఆదివారం అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేపట్టడాన్ని నిరసిస్తూ.. అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షులు జీ.బేబీ రాణి సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని.. దీక్షలో కూర్చున్న అంగన్వాడీలను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని చూడకుండా రోడ్డుపై ఈడ్చి పారేసిన చర్యలను ఖండిస్తున్నామన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కోటి సంతకాల సేకరించి సీఎంకు అందించాలని భావించామని.. కనీసం సీఎంను కలిసే అవకాశం కూడా లేకుండా పోలీసులతో అడ్డుకుంటున్న వైనం సిగ్గుచేటన్నారు. అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరని.. ఎన్ని అరెస్టులు చేసినా మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అనేక పోలీస్‌ స్టేషన్లకు తరలించినా అక్కడ కూడా మా అంగన్వాడీలందరూ ఆందోళన చేపడుతున్నారని తెలిపారు. అరెస్టు చేసిన నాయకులను ఎంత దూరంలో వదిలేసినా మళ్లీ విజయవాడ వచ్చి ఉద్యమం కొనసాగించి తీరుతామని తెలిపారు. అంగన్వాడీ మహిళలందరూ కూడా ఇళ్లకు వెళ్ళకుండా.. ఎక్కడ అయితే అరెస్టులో ఉన్నారో అక్కడే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. స్టేషన్‌ నుంచి వదిలిన వెంటనే మళ్లీ విజయవాడ తరలిరావాలని కోరారు.

మా ఉద్యమాన్ని అణిచివేయాలని పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. నాయకులు కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని.. పోలీసులు వాటిని నిరూపిస్తే… ఆ కోటి వాళ్లకే ఇస్తామన్నారు. అంగన్‌వాడీలను తొలగించి, ఇరవై వేల మందిని కొత్తగా నియమించామని అబద్దాలు చెబుతున్నారన్నారు. అంగనవాడీ మహిళా ఉద్యమం వెనుక ఎటువంటి రాజకీయ శక్తులు లేవని.. కార్మిక శక్తి, మహిళా శక్తి మాత్రమే ఉందాన్నారు. హక్కులు సాధించుకునే వరకు ఈ పోరాటం ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.

➡️