ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : శేషాచలం అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనం తరలిపోకుండా కాపాడడానికి ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి స్మగ్లర్ల నుండి అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకోవడానికి టాస్క్ఫోర్స్ ఆర్ఎస్ఐ విశ్వనాథ్ బఅందం సోమవారం సాయంత్రం కేంద్ర కార్యాలయం నుండి కెవి.పల్లి మండల పరిధికి వాహనాల తనిఖీ నిమిత్తం బయలుదేరారు. మంగళవారం తెల్లవారుజామున కెవి పల్లి మండలం గుండ్రాల క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఎర్రచందనం దుంగలతో అటుగా వస్తున్న స్మగ్లర్ల వాహనంలోనివారు వాహనాల తనిఖీని గమనించి టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఎలాగైనా అధిగమించి పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో వాహనాన్ని అడ్డుకోవడానికి రోడ్డుకు అడ్డుగా నిలబడిన టాస్క్ ఫోర్స్ బఅందంలోని కానిస్టేబుల్ గణేష్ పై కారును పోనిచ్చారు. స్మగ్లర్లు అతివేగంతో కారును పోనివ్వడంతో గణేష్ ప్రాణాలు విడిచారు. గణేష్ స్వస్థలం ధర్మవరం టౌన్. గణేష్ మాత్రమే ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నారు. గణేష్ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతను తీసుకొని పోలీస్ విభాగంలో ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నారు. గణేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాన్స్ఫర్ పై వచ్చిన గణేష్ తిరుపతి నగర పరిధిలోని జీవకోన ప్రాంతంలో నివాసం ఉన్నట్టుగా టాస్క్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి. గణేష్ మఅతి పట్ల టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్, డి.ఎస్.పి చెంచు బాబు, ఇతర అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.