రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు : కెటిఆర్‌

Apr 14,2024 12:42 #Constitution, #KTR, #speech

తెలంగాణ : ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేద్కర్‌ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గని మాట్లాడారు. ఆ మహనీయుడు చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితో కెసిఆర్‌ లక్షలాది మందిని సమీకరించి 14 ఏళ్లు తెలంగాణ పోరాటాన్ని నడిపించారన్నారు. రాష్ట్రంలో 1,022 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటి నుంచి బయటకు వచ్చిన లక్షలాదిమంది ఇప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో 125 అడుగుల బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. అది విగ్రహం కాదు విప్లవం అనే మాట కెసిఆర్‌ చెప్పారు. సచివాలయానికి ఆ మహనీయుడి పేరు పెట్టాం. మహాత్మా గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడు అంబేద్కర్‌. బడుగు బలహీన వర్గాల కోసం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా.. అవన్నీ ఆయన ఆలోచన నుంచి వచ్చినవేనన్నారు. సమాజంలో సమానత్వం రావాలి అంటే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని కెటిఆర్‌ అన్నారు.

➡️