- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో రెండు పార్లమెంటు, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిపిఐ పోటీ చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియా ఫోరంలో వున్న సిపిఎం, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్, సిపిఎంతో చర్చించాక పోటీ చేసే అభ్యర్థుల వివరాలను, నియోజకవర్గాల పేర్లను వెళ్లడిస్తామని పేర్కొన్నారు.
డిఎస్సి వాయిదా వేయాలని లేఖ
రాష్ట్రంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించనున్న డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిఇఒకు రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియతోపాటు, పదోతరగతి స్పాట్ వాల్యూయేషన్, డిఎస్సి నిర్వహణ ఒకే సమయంలో నిర్వహిస్తే సమస్యలు వచ్చే అవకాశం వుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ డిఎస్సిని వాయిదా వేయాలని కోరారు.