ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలి – సిపిఎం రాష్ట్ర కమిటీ

Jun 16,2024 22:50 #CPM State Committee, #prakatana

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి నాయకత్వంలో జనసేన, బిజెపి కూటమి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాటిలో ఐదు హామీలపై ముఖ్యమంత్రి తొలి సంతకాలు చేయడం పట్ల సిపిఎం స్వాగతించింది. అలాగే ఎన్నికలకు ముందు ప్రజలకు టిడిపి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. జూన్‌ 15న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అధ్యక్షతన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో జరిగిన ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. ఈ మేరకు ఆదివారం సిపిఎం రాష్ట్ర కమిటీ చర్చించి ఆమోదించిన తీర్మానాన్ని పార్టీ రాష్ట్ర కమిటీ విడుదల చేసింది.
రాష్ట్రంలో ప్రత్యేకించి ఏజెన్సీలో జిఓ 3 పునరుద్ధరించి స్పెషల్‌ డిఎస్‌సి నిర్వహించాలని గిరిజన యువత ఎదురుచూస్తున్నది. స్మార్ట్‌మీటర్ల రద్దు చేస్తారని, ఉపాధి కల్పిస్తారని, ధరల భారాలను తగ్గిస్తారని, అదనపు భారాలు వేయబోరని, అవినీతి లేని పాలన అందిస్తుందని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని టిడిపి కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు ఆశతో వున్నారు. గత వైసిపి ప్రభుత్వ వైఫల్యాల నుండి నేర్చుకొని ప్రజానుకూల పాలన అందించడం ద్వారా ప్రజల ఆశలు నెరవేర్చాలని సిపిఎం కోరుతున్నది.
బిజెపి నాయకత్వంలోని కేంద్ర ఎన్‌డిఎ ప్రభుత్వం విభజన చట్టం హామీలు అమలు చేయకుండా గత పదేళ్లు కాలయాపన చేసింది. ప్రత్యేక హోదాను తిరస్కరించి ద్రోహం చేసింది. ప్రస్తుతం ఎన్‌డిఎలో టిడిపి, జనసేన పార్టీలు చేరడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా వుంది. ఇప్పటికైనా అమరావతిలో రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పూర్తిస్థాయి పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్‌, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమ లాంటి హామీల అమలు కోసం ఈ ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలి. అన్ని పార్టీలనూ కలుపుకుపోయి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిలబెట్టాలని కోరుతున్నాం. రాజధాని సమస్యకు శాశ్వత పరిష్కారంగా అమరావతిపై ప్రత్యేక చట్టం చేసి అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నాం. రాష్ట్ర హక్కుల కోసం లౌకికవాద రాజ్యాంగ సంస్థల పరిరక్షణ కోసం టిడిపి నిలబడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
గత ఐదేళ్ల పాలనలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు సరికదా జనంపై విపరీతమైన భారాలు మోపింది. అవినీతిలో కూరుకుపోయింది. కింది స్థాయిలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రకృతి వనరులను, ప్రజల ఆస్తులను దోచుకోవడానికి అరాచకాలకు పాల్పడ్డారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు లాంటి దుర్మార్గమైన చట్టాలు ప్రజలపై రుద్దింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, నిరుద్యోగులు, వివిధ తరగతుల వారి నిరసనలను, ప్రజా ఉద్యమాలను నిరంకుశంగా అణచివేసే చర్యలకు పాల్పడింది. కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన అన్ని వినాశకర బిల్లులనూ బలపరచింది. వీటన్నింటి వల్ల తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఎన్నికల్లో వైసిపిని దారుణంగా ఓడించారు. ఓటమికి కారణాలపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలపై అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదు. ఇప్పటికీ కేంద్ర ఎన్‌డిఎ ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరినే ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. బిజెపి పట్ల వైసిపి సానుకూల వైఖరిని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కేంద్రంతో రాజీపడే వైఖరిని ఇప్పటికైనా విడనాడి లౌకికశక్తుల పక్షాన నిలబడాలని కోరుతున్నాం. కేంద్రంలో మతోన్మాద బిజెపికి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. మోడీ నాయకత్వంలో మూడోసారి ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. గత రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి బిజెపి సొంత మెజారిటీ తెచ్చుకోలేకపోయింది. ప్రజలు బిజెపి విధానాలను, పద్ధతులను తిరస్కరించారు. తెలుగుదేశం, జెడియు తదితర మిత్ర పక్షాలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత పదేళ్లలో రైతు, కార్మిక, ప్రజా ఉద్యమాలను, ప్రశ్నించే గొంతులను అణచివేయడం, రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసి దేశంపై నిరంకుశత్వాన్ని రుద్దింది. కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెట్టింది. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవాలనుకున్న బిజెపి ఆశలు విఫలమయ్యాయి. బిజెపి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి తెలుగుదేశం తోడ్పడింది. బలహీనపడ్డ బిజెపికి ఊపిరిపోసింది. కేంద్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించనున్న టిడిపిపై కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన విద్యుక్త ధర్మం వుంది. ఈ బాధ్యతను నెరవేర్చటానికి కేంద్రంపై టిడిపి ఒత్తిడి తేవాలని కోరుతున్నాం.
రాష్ట్రంలో బిజెపి ప్రమాదం గతం కంటే పెరిగింది. కేంద్రంలో అధికారంలో వుండడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం ద్వారా దాని మతతత్వ రాజకీయాలను విస్తరించుకోవడానికి భూమిక ఏర్పడింది. లౌకికవాదాన్ని బలహీనం చేయడానికి, రిజర్వేషన్లు రద్దు చేయడానికి అది ప్రయత్నిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో టిడిపి, బిజెపిలు భాగస్వాములుగా ఉన్న స్థితిలో రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడటానికి, రాజ్యాంగ వ్యవస్థలను ప్రత్యేకించి లౌకికవాదాన్ని, రిజర్వేషన్లను రక్షించేందుకు, మైనార్టీలకు రక్షణ కల్పించేందుకు టిడిపి గట్టి సంకల్పంతో వ్యవహరించాలని కోరుతున్నాం. మత ఉద్రిక్తతలు, ఘర్షణలు పెంచే ఎలాంటి ప్రయత్నాలనూ సహించకుండా రాష్ట్రంలో సామరస్య వాతావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
గత ప్రభుత్వ హయాంలో న్యాయమైన తమ కోర్కెల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, స్కీం వర్కర్స్‌, మున్సిపల్‌, ఆర్‌టిసి కార్మికులు, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, సామాజిక తరగతులు అనేక ఉద్యమాలు చేపట్టారు. ఉద్యమించిన వివిధ ప్రజా సంఘాల, ప్రతిపక్షాల కార్యకర్తలపై నిర్బంధంతోపాటు అక్రమ కేసులు బనాయించింది. ఇలాంటి నిరంకుశ పోకడలకు ఈ ప్రభుత్వం స్వస్తి చెప్పి అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. ప్రజా సమస్యలపై సంబంధిత సంఘాలతో చర్చించి సామరస్యంగా పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
ఈ ఎన్నికల్లో రెండు బలమైన శిబిరాల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో వామపక్షాలు, సిపిఎం, ఇండియా బ్లాక్‌ పార్టీలు ఎదురీదాయి. అయినప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో అరకు పార్లమెంటు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపికి వ్యతిరేకంగా, ఆదివాసీ సమస్యలపై సిపిఎం చేసిన కృషి ఫలితంగా గతంకన్నా ఎక్కువ ఓట్లు వేసి ఆదరించారు. వారికి సిపిఎం రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నది. రాష్ట్రంలో సిపిఎం, వామపక్షాలు, ఇండియా బ్లాక్‌ పార్టీలకు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రజానుకూల నిర్ణయాలను సిపిఎం బలపరుస్తుంది. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని ఒత్తిడి చేస్తుంది. మన రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంపై పోరాడేందుకు మద్దతు ఇస్తుంది. ప్రజల తరపున, శ్రామిక ప్రజలపక్షాన గతంలో వలె నికరంగా నిలబడి పోరాడుతుందని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నాం. బిజెపి మతోన్మాదానికి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, లౌకిక ప్రజాతంత్ర వాదులతో కలిసి కృషి చేస్తుంది. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలుకోసం రాష్ట్ర ప్రజలను, ప్రజా సంఘాలను కలుపుకుని ఐక్య ఉద్యమాలను నిర్మించేందుకు పనిచేస్తుంది. సామాజిక న్యాయం, సంక్షేమం, లౌకికతత్వం, రాష్ట్రాభివృద్ధి కోసం కృషిని కొనసాగిస్తుంది. ఈ ప్రయత్నాలకు ప్రజలు అండదండలివ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.

➡️