చిత్తూరు: చిత్తూరు జిల్లా శాంతిపురం మండల డిప్యూటీ సర్వేయర్ ఎస్.సద్దాం హుస్సేన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సస్పెండ్ చేశారు. ఓ రైతు నుంచి సర్వే పని పూర్తి చేయడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేశారని డిప్యూటీ సర్వేయర్ పై అభియోగాలు నమోదు చేశారు.. అయితే, రైతు ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు.. అది నిజమేనని నిర్ధారణకు వచ్చారు.. దీంతో జాయింట్ కలెక్టర్ అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు.. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి సర్వే చేయడానికి కూడా లంచం డిమాండ్ చేశాడట. శాంతిపురం మండలం శివపురం వద్ద ఇంటి నిర్మాణానికి.. చంద్రబాబు నాయుడు గతంలో స్థలాన్ని కొనుగోలు చేశారు.. అది వ్యవసాయ భూమి కావడంతో భూవినియోగ మార్పిడి, సబ్ డివిజన్ కోసం.. టీడీపీ నాయకులు దరఖాస్తు చేశారు.. ఈ సమయంలో డిప్యూటీ సర్వేయర్ 1.80 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడని సమాచారం.
గత కుప్పం పర్యటన సమయంలో స్థానిక కుప్పం నేతలు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఓ రైతు పొలం సర్వే చేయడానికి లంచం డిమాండ్ చేయడం.. ఆ రైతు అధికారులకు ఫిర్యాదు చేయడం.. విచారణలో అది నిజమేనని తేలడంతో.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/9.jpg)