అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత

May 6,2024 16:51 #saradhi

టిడిపి,జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారధి
ఆగిరిపల్లి : తనను ఎన్నికల్లో గెలిపిస్తే నూజివీడు సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి,జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారధి అన్నారు. ఏలూరుజిల్లా ఆగిరిపల్లి మండలంలోని తోటపల్లి, సింగన్నగూడెం గ్రామాల్లో సోమవారం ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కె.పి.సారధి మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో నూజివీడు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తననూ, ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా పుట్టా మహేష్‌ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నూజివీడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నూజివీడు ప్రాంత రూపురేఖలను పూర్తిగా మారుస్తానన్నారు. మునుపెన్నడూలేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానన్నారు. సంక్షేమ పథకాలు జగన్‌రెడ్డి ప్రభుత్వం కంటే చంద్రబాబు ప్రభుత్వం 15 నుంచి 20 శాతం అదనంగా పెంచి ఇస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కూటమి ప్రభుత్వం బాగా దొరుకుతాయన్నారు. నూజివీడు నియోజకవర్గంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. మల్లవల్లి ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్‌ పునరుద్ధరణకు కృషిచేస్తానన్నారు. మామిడి అనుబంధ పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ, మండ, గ్రామ టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️