ప్రజాశక్తి-అమరావతి : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫారం-7లు దాఖలు చేసి ఓటును తొలగించేందుకు ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ దాఖలైన కేసులో హైకోర్టు స్పందించింది. తుది ఓటరు జాబితా నుంచి పిటిషనర్ల పేర్లను తొలగించొద్దని మధ్యంతర ఆదేశాలిచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీరును తప్పుపట్టింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం సవరించిన ఓటర్ల లిస్ట్పై తేదీ లేకపోవడాన్ని ఆక్షేపించింది. విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేస్తూ జస్టిస్ ఎన్ జయసూర్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన బి గౌతమి సహా 11 మంది రిట్లు దాఖలు చేశారు. అధికార వైసిపి చెప్పినట్లుగా ఓట్ల నమోదు జరుగుతోందని, తమ పేర్లను తొలగిస్తున్నారని పిటిషనరు వాదించారు.