హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండ్రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని పేర్కొన్నారు. జనవరి ఒకటో తేదీ తర్వాత చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.మరో వైపు హైదరాబాద్ శివారులో చలిపులి పంజా విసురుతోంది. ఉదయం పూట బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. చలి తీవ్రత పెరగటంతో చిన్నారుల్లో న్యూమోనియా సహా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గవదబిళ్లల సమస్యలతో చిన్నారులు భారీగా ఆసుపత్రుల్లో చేరుతున్నారని చెప్పారు.